Monday 30 January 2012

పశువుల కాపరి ఆత్మతత్త్వం

సూర్యోదయానికి ముందు గాఢమైన చీకట్లు మెల్లగా కరుగుతున్న సమయం.
గోదావరి  ఒడ్డు దగ్గర ఉదయపు సంధ్యావందనం పూర్తిచేసుకుని , శిష్యులతో వేదవిధానాల గురించి , ఆత్మతత్త్వాన్ని గురించి చర్చిస్తూ వస్తున్నాడు ఒక గురువు .

'గురువుగారు , ఆత్మ అంటే ఏంటి అండి ? ' అంటూ ఒక శిష్యుడు ఆతృతగా అడిగిన ప్రశ్నకి సమాధనంగా వివరణ ఇస్తూ ..

' సర్వాన్ని సాక్షిగా వీక్షిస్తూ , మాయకీ , మార్పుకీ అందనిదే ఆత్మ ' అని చెబుతున్నాడు గురువు . 

వారి సంభాషణ ఈ విధంగా సాగుతూండగా ,ఎదురుగా ఒక పశువులకాపరి అప్పుడేలేచి తన  విధులకి తయారవుతూ వీరి సంభాషణ విన్నాడు.

ఆ రోజు రోజంతా అదే విషయం అలోచిస్తూ గడిపాడు ,' సర్వాన్ని సాక్షిగా వీక్షించటం ' అనేది వాడి మనస్సుకి బాగా హత్తుకుపోయింది . అసలు అలా ఉండటం కుదురుతుందా అనే ఆలోచన వాడి మనస్సులో మొలకెత్తింది . ఇదేదో ప్రయత్నిస్తేగాని అర్ధం అవ్వదనుకుని , అప్పటినుండీ అన్నిటినీ కేవలం సాక్షిగా చూడటం మొదలు పెట్టాడు .

మొదట్లో అలా ఉండటం అస్సలు కుదరలేదు. మరీ ముఖ్యంగా భావోద్వేగాల విషయంలోనూ , ఆకలి దప్పుల విషయంలోనూ ఇది అసలు సాధ్యం కాలేదు. ఒక పక్షం రోజుల తర్వాత ఇది మన వల్ల కాదు వదిలేద్దామనుకుని , కర్ర భుజమ్మీద వేసుకుని ఇన్నాళ్ళ తన ప్రయోగం గురించి పునరాలోచన చేస్తూ అల నది వడ్డున కూర్చున్నాడు .



ఎదురుగా ప్రవహిస్తున్న గోదారి అలలు , మెల్లగా వీస్తున్న తెమ్మరలు , నది అలలమీద నుండి వీచే గాలి చప్పుడు అన్నీ ఒక రకమైన ధ్యానానుగుణమైన వాతవరణం కల్పిస్తూ ఉండగా , ఆ పశువుల కాపరి దృష్టి ప్రవహిస్తూన్న నదిమీద పడింది . ఈ క్షణం కనపడిన అల , మరునిముషం అక్కడ ఉండట్లేదు . ఈ క్షణం తనను స్పృశించిన  గాలి , మరునిముషం ఎక్కడకి వెళ్తోందో  తెలియట్లేదు. కొత్త కొత్త అలలు పుడుతూనే ఉన్నాయి , కొత్త కొత్త అనుభూతులను  గాలి కలిగిస్తూనే ఉంది  . కాని ఆ నది స్వరూపం , ఆ గాలి స్వరూపం మటుకు మారట్లేదు. అల కొత్తదైనా పాతదైనా , నదికి ప్రవహించటమే లక్షణం , ఇదంతా ఎదో విశ్వరచనకు లోబడి సాగుతూన్నట్టుగా తోచింది ఆ పశువుల కాపరికి.

' గురువుగారు అన్న ఆ ఆత్మ తత్త్వానికి , గోదారి తల్లి బోధిస్తున్న ఈ విశ్వరచనకి ఎమైనా సంబంధం   ఉందా ?'  అంటూ మళ్ళీ వాడి మదిలో ఒక ప్రశ్న మొలకెత్తింది .

దీర్ఘాలోచనలోన చేస్తూ వాడు సమాధి స్థితిలోనికి జారుకున్నాడు . ఒక 20 సంవత్సరాలు అలా గడిచిపోయాయి. ఆ పశువుల కాపరి  చుట్టూ పుట్టలొచ్చేశాయి .

అంతకుముందు ఆత్మ గురించి చెప్పిన గురువు పరమపదించారు ,  ఆత్మ గురించి అడిగిన శిష్యుడు ఆ గురువు మఠానికి ఆచార్యుడయ్యాడు.

అలా ఒకనాటి సాయంకాలం , ఆ పశువుల కాపరి సమాధి నుండి మేల్కొని తన స్థితిని గమనించుకుని అక్కడ నుండి  లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

ఈ రెండు దశాబ్దాలుగా , ఏ భావోద్వేగాలూ , ఏ రసస్పందనలు , ఏ ఆకలి దప్పులు లేని స్థితిలో తనను నడిపించిన చైతన్యం ఎదైతే ఉందో , ఆ చైతన్యపు విశ్వరచన యొక్క లిపి కొంత అవగతమయ్యేసరికి తనను తాను మర్చిపోయి ఆ తత్త్వం యొక్క ఆద్యంతాలను నిరంతరం దర్శించాలని తపిస్తూ ముందుకు సాగిపోతున్న అ పశువుల కాపరికి , దూరంగా మైకు నుంచి వినపడుతున్న ఒక పండితుడి మాటలు వినిపించాయి .

' సర్వాన్ని సాక్షిగా వీక్షిస్తూ , మాయకీ , మార్పుకీ అందనిదే ఆత్మ ' అని చెబుతున్నాడు ఆ వక్త .  ఆ వక్త ఎవ్వరో కాదు , పూర్వం ఆత్మ గురించి అడిగిన శిష్యుడు మరియు  నేటి ఆచార్యుడు .

తనకు ఆత్మ బోధ చేసిన ఆ గురువు ఙ్ఞాపకం వచ్చి ఒక సారి చూసివద్దామని  అటువైపు వెళ్ళాడు ఆ పశువులకాపరి .

ఆ ప్రవచనం వినపడుతున్న సభాప్రాంగణం అంతా  విద్యుద్దీపాలతో , మైకుల హోరుతో , భక్తుల వరుసలతో కిట కిటలాడిపోతోంది . అంత మంది లో చినిగిన బట్టలతో , జడలు కట్టేసి , వికృతంగా ఉన్న ఆ పశువులకాపరిని చూసి , ఆ ఆచార్యుని శిష్యవర్గం తరిమివేసింది .

' ఛీ ! శౌచంలేని వాడా , ఇటు రాకు .. పవిత్రమైన ఈ ప్రాంగణం పాడుచెయ్యకు ' అంటూ ఆ ప్రవచనానికి వచ్చిన వారందరూ ఆ పశువులకాపరిని తన్ని తరిమివేసారు .

'నైనం ఛిందంతి శస్త్రాణి ...' అంటూ భగవద్గీతనుండి  శ్లోకం మైకు నుంది వినపడుతూంది .

ఒక చిరునవ్వు నవ్వి అక్కడ నుంచి నిష్క్రమించాడు ఆ పశువుల కాపరి . 

4 comments:

  1. చక్కగా వ్రాసారండి.

    ReplyDelete
  2. చాలాబాగా రాశారు

    ReplyDelete
  3. కథ బాగుంది. కానీ, రచయిత హృదయం నాకు అర్థం కాలేదు. పశువుల కాపరి గొప్పవాడనా? చెప్పేవారు చెయ్యరనా?

    ఆత్మ తత్త్వాన్ని అర్థం చేసుకున్నవారు అన్నింటికీ సాక్షిగా మాత్రమే ఉంటారు. వారు ఎవరికీ ఉపదేశించాలని అనుకోరు కదా?

    ఈ కథలో గురుశిష్యుల ప్రయోజనం ఏమిటంటే మిగిలినవారిలో (ఇక్కడ పశువులకాపరిలాంటి వాళ్ళలో) ఆత్మతత్త్వపు విచారణని మొలకెత్తించటమే. వాళ్ళే లేకపోతే, ఇక్కడ పశువుల కాపరికి ఆ ఆలోచనే తట్టదు కదా!

    ఇంక శిష్యుడి విషయమంటారా? మరింతమందికి ఆ ఆలోచన రేకెత్తించేవరకూ అతనికి స్వతఃగా ఆ ఆలోచన రాకపోవచ్చు. అతనికే ఆ ఆలోచన వచ్చేస్తే, అతను ఇంక మరెవరికీ మైకులు పెట్టి మరీ చెప్పడు. హాయిగా ఓ మూల కూర్చొని అన్నిటినీ సాక్షిగా మాత్రమే చూస్తూ ఉంటాడు. ఏమో దారినపోతూ గురుశిష్యులు మాట్లాడుకున్న మాటలకే ఒక పశువుల కాపరి ఉద్ధరింపబడితే, గాలివాటున మైకుల్లోంచి వినబడి ఇంకెంతమందికి ఆ స్థితి వస్తుందో కదా.

    ReplyDelete
    Replies
    1. anrd గారు , కష్టేఫలి గారు ,గుత్తినశ్రీనివాస్ గారు ,కథ మీకందరికీ నచ్చినందుకు చాలా సంతోషమండి.

      అన్నీ ఇచ్చే దేవుడికి భేదాభిప్రాయాలు ఏమీ ఉండవు , ఆ దేవుడు ఇచ్చే వస్తువులకి కూడా ఆ భేదాభిప్రాయాలు ఉండవు , కాని అవి ఉపయోగించుకునే మనకే అన్ని లంపటాలూనూ . అలాగే గురువు చెప్పేది ఒకళ్ళ కోసమే కాదు , అందరి కోసమూనూ , ఇది గ్రహించిన వారే నిజమైన శిష్యులని నా ఉద్దేశం. ఇది గ్రహించ లేని శిష్యులు హంగూ ఆర్భాటాలకు , బాహ్యాలంకరణలకు మురిసి , గురువు గారి బోధల్లోని నిజమైన సారాన్ని గ్రహించలేకపోతున్నారని నా అభిప్రాయం.

      ఇక పశువులకాపరికీ , ఆ శిష్యుడికీ వ్యత్స్యాసం తీవ్రమైన జిఙ్ఞాస . ఆత్మవిద్యలో అత్యంత ఆవశ్యకం ఈ జిఙ్ఞాస అని శ్రీ రామకృష్ణ పరమహంస గారి బోధ . ఒకే బోధ , ఒకే గురువు నుండి వచ్చినా వీరిద్దరి తర్వాత స్థితులకి కారణం ఆ జిఙ్ఞాస , అందుకే వారిద్దరి మధ్య తేడా చూపటం జరిగింది .

      అన్నిటికీ మూలమైన భగవానుడే , తాను కూడా కర్మ చేస్తానని గీత లో చెప్పుకున్నాడు , అలాగే గురువు స్వతహాగా ఆత్మ ఙ్ఞాని ఐనా , లోక హితం కోసం బోధ చేస్తాడు , ఆ బోధల పరమార్ధం అర్ధం చేసుకోవటం మన కర్తవ్యం అని చెప్పటం నా ఉద్దేశం

      Delete