Friday 11 September 2015

రైతు వధ





చం ||

నిరతపు వహ్నియై రుణము నీ హృదయాంతరమున్ దహింప, సు
స్థిరముగ వర్షలేమి జన జీవ వనంబు దహించుచుండ నా
వరుణుడు రాడు తాపఝరి పంటల నంతము చేయ , రైతు సో
దర ! కను జారు నీరునిక దాచు క్షుధార్తిని దీర్చు నద్దియే


"నిరతపు వహ్నియై రుణము నీ హృదయాంతరమున్ దహింప" == చేసిన అప్పు నిత్యమూ మనసులో మంటగా మారి కాలుస్తూ,
"సుస్థిరముగ వర్షలేమి జన జీవ వనంబు దహించుచుండ" == ఏది స్థిరంగా ఉన్నా లేకపోయినా వర్షలేమి మాత్రం స్థిరంగా , జనారణ్యాన్ని కాలుస్తూంటే
"వరుణుడు రాడు తాపఝరి పంటల నంతము చేయ" == వర్షం రాదు , వేడి ఇంకొకపక్క వేసిన విత్తులని చంపేస్తూ
" క్షుధార్తిని " == ఆకలి

జూలై ఆగష్టులలో వర్షాలు పడాలి , కాని పడవు...
వ్యవ'సాయా'న్ని నమ్ముకుని బ్రతకాల్సిన రైతులు , ప్రభుత్వ 'సాయా'న్ని అర్ధిస్తూ ...
విత్తనాలని పురుగుమందులని అప్పులు చేసిన రైతులు అప్పు ఎలా కట్టాలో తెలియక ఆత్మహత్యలని ఆశ్రయిస్తున్నారు.
అన్నదాతలే అన్నార్తులై , తాము దున్నిన పొలాల్లోనే కూర్చుని పురుగుమందులు తాగి చచ్చిపోతున్నారు

ఇది ఈరోజు కొత్తగా మొదలైంది కాదు..

ఒక దశాబ్దానికి పూర్వం నుంచే అన్నదాతలు బలవన్మరణాలకి పాల్పడుతున్నారు .. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ( తెలంగాణ తో కలిపి ) , మహారాష్ట్రలో ఎక్కువ మంది ..

2004 లో 18,241 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
2010 లో 15,963 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
2011 లో 14,207 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు
2012 లో 13,754 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు  ( Source : wikipedia )

1995 నుంచి మహారాష్ట్రలో రోజుకి పది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ( National Crime Records Bureau statistics )

Indian Meteorological department అంచనాల ప్రకారం , 2000-2013 మధ్య కేవలం నాలుగు సంవత్సరాలే జూన్-సెప్టెంబరు మధ్య పడాల్సిన వర్షాలు సరిగ్గా పడ్డాయి

మధ్యలో బిటి పత్తి అని GM Crops అని వచ్చి విత్తనాల రేట్లు పెంచి , తద్వారా రైతు అప్పులు పెంచి, ఆత్మహత్యలకి పరోక్షంగా సహాయపడ్డాయి...

ఇన్ని పద్మవ్యూహాల మధ్య , మన రైతు అభిమన్యుడై యుద్ధం చేస్తున్నాడు..
అప్పటి భారతం అభిమన్యుడిని కోల్పోయింది .. ఇప్పటి భారతమైనా జాగ్రత్త పడి మన అభిమన్యులని కాపాడుకుందాం..




      

1 comment:

  1. పద్యం బావుంది.
    ధన్యవాదములు

    ReplyDelete